ఆ భయంతో నాకు మేలే జరుగుతోంది !

కీర్తిసురేష్… భయంతో భలే మేలు అంటోంది నటి కీర్తిసురేష్. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నఈ కేరళ కుట్టి చిన్నతనం నుంచే నటి అవ్వాలన్న ఆశను పెంచుకుంది. తన కుటుంబసభ్యులు వద్దన్నా, ఎలాగో వారిని ఒప్పించి నటిగా రంగప్రవేశం చేసిన ఈమె అనతికాలంలోనే కథానాయకిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఆరంభ దశలో ఏ నటి సాహసించని మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘నడిగైయార్‌ తిలగం’ (‘మహానటి’) చిత్రంలో సావిత్రిగా నటించి ఆ పాత్రను తనకంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లు ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో కమర్షియల్ చిత్రాల కథానాయకిగానూ తనదైన ముద్ర వేసుకున్న కీర్తిసురేష్ వరుసగా ‘సామీ ‘, ‘పందెంకోడి–2’, ‘సర్కార్‌’ …వరుసగా స్టార్స్‌ చిత్రాల్లో నటించింది. దక్షిణాది భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ తారామణి తన సినీ అనుభవాలను మీడియాతో పంచుకుంది…
 
“సినిమాను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. అయితే నటీనటులకు సినిమానే జీవితం.ఒక్కో పాత్రను ఒక జీవితం అనుభవించినట్లు నటిస్తున్నాం. దర్శకులు చెప్పిన కథలు విన్న తరువాత అందులోని పాత్రకు న్యాయం చేయగలమా? అన్నది పదిసార్లు ఆలోచిస్తాం. ఆ పాత్రలు ప్రేక్షకులకు నచ్చుతాయా? అన్న కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలతోనే అందరు నటీనటులు కథలను ఎంచుకుని నటిస్తున్నారు. ఇతరుల కంటే నాకు అలాంటి ప్రశ్నలు కాస్త ఎక్కువే. అలా ప్రశ్నించి నటించడం వల్ల నాకు మంచే జరుగుతోంది. ఒక్కో చిత్రంలో నటించే ముందు లక్ష ప్రశ్నలు, భయాలు కలిగినా అన్నింటికీ దర్శకుల వద్ద జవాబులుంటాయి. అయినా ఒక్కో చిత్రంలో నటించేటప్పుడు నాకు భయమేస్తుంది. ఆ భయంతోనూ నాకు మేలే జరుగుతోంది. భయం కారణంగా పాత్రలపై మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. సినిమా పయనం ఒక సస్పెన్స్‌ కథ మాదిరి ఉండాలి. ‘మహానటి’ చిత్రంలో నటించేటప్పుడు భయపడుతూనే నటించాను. అయితే ఆ చిత్ర విజయంతో అనుభవించిన సంతోషాన్ని మాటల్లో చెప్పనలవికాదు” అని కీర్తిసురేష్ చెప్పింది.