విజయం ఎంత విలువైనదో నాకు బాగా తెలుసు!

మహేష్ బాబు ‘భరత్అనే నేను’ తో దక్షిణాదిలో, ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్‌సింగ్‌’ తో బాలీవుడ్‌ లో స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది కియారా అద్వాణీ. ” కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని..‘కబీర్‌సింగ్‌’ విజయం తన వ్యక్తిత్వాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని చెబుతోంది ఈ పంజాబీ సుందరి. ‘ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు మనం ఏవిధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. విజయాల్లోనే వినమ్రంగా ఉండటం అలవర్చుకోవాలి. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కాబట్టి.. విజయం ఎంత విలువైనదో నాకు బాగా తెలుసు. అనుక్షణం దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్‌ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అదీ మంచిదే. ‘భయం’ ‘బాధ్యత’ను నేర్పుతుంది. ‘స్ట్రాంగర్‌’గా, ‘బెటర్‌’గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది”…అని చెప్పింది.
 
ఒక్క అభిమాని కూడా నిరుత్సాహపడొద్దు!
“సెట్స్‌లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులు సెల్ఫీ అడిగితే ఎప్పుడూ కాదనను. షూటింగ్‌లో అలసిపోయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు.. అక్కడ చాలా మంది సెల్ఫీల కోసం పోటీపడుతుంటారు. అలాంటి సమయాల్లో కూడా ప్రశాంతంగా సెల్ఫీలు తీసుకోమని చెబుతా. ఎవరినైనా కాదంటే ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతుంది. నా వల్ల ఒక్క అభిమాని కూడా నిరుత్సాహపడొద్దనుకుంటా. అభిమానులు నా కుటుంబం లాంటివారు. నాకొస్తున్న పేరుకు వారే కారణం” అని కియారా అద్వాణీ చెప్పింది.
ఒకప్పుడు సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని భయం కలిగేదని, ఇప్పుడు రిజల్ట్‌ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టిపెడుతున్నానని చెప్పింది. తన ఉన్నతిలో దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ కీలకభూమిక పోషించారని..ఆయన దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంలో నటించాలన్నది తన కోరిక అని చెప్పింది. అలాగే సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉంది. నేను ‘తప్పనిసరిగా నటించాలి’ అనుకునే హీరో రణ్‌వీర్‌సింగ్‌. దమ్మున్న హీరో. ఇక హీరోయిన్‌లలో ఆలియా భట్, దీపికా పదుకొనేలతో కలిసి నటించాలని ఉంది…అని చెప్పింది. ప్రస్తుతం కియారా అద్వాణీ హిందీలో ‘లక్ష్మీబాంబ్‌’, ‘ఇందూ కి జవానీ’, ‘షేర్షా’, ‘బూల్‌ బులయ్యా-2’ చిత్రాలతో బిజీగా ఉంది.