పరువు హత్య యదార్థ సంఘటన ఆధారంగా ‘బంగారి బాలరాజు’

నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు” చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బంగారి బాలరాజు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కోటేంద్ర దుద్యాల సినిమా వివరాలు తెలియచేశారు.
 
రాయలసీమలో జరిగిన ఒక యధార్ధ పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఈ మధ్య పరువు కోసం తల్లి దండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. కానీ ప్రేమలో ఉంటే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. తాజాగా మిర్యాలగూడలో ప్రణవ్, అమృత ఘటన సంచలనం రేపింది. ప్రణయ్ పరువు హత్య అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి పరువు హత్యలకు సరైన రీతిలో ముగింపు సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా మా వంతు ప్రయత్నం సినిమా ద్వారా చేశాం. ఇటు ప్రేమికుల సమస్యలను, అటు తల్లిదండ్రుల సమస్యలను.. ఇటు పెళ్లిల్ల నేపథ్యంలో ఉన్న సమస్యలను చర్చించడం జరిగింది. మంచి కథ .. సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు ఉంటాయి.. అని కోటేంద్ర వెల్లడించారు.
 
బంగారి బాలరాజు చిత్రంలో ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లి కొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు  మా నిర్మాతలు ఇచ్చిన సహకారం మరవలేనిది. హీరో హీరోయిన్ గా నటించిన రాఘవ్ , కరోణ్య తమ తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. అలాగే టెక్నీకల్ టీమ్ సపోర్ట్ కూడా మరవలేనిది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో వస్తున్నా ఈ సినిమా తప్పకుండ ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది అని దర్శకుడు కోటేంద్ర తెలిపారు.
 
బంగారి బాలరాజు సినిమా తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తాను. కథ, కథనాలపై కసరత్తు చేస్తున్నాం. ఆ చిత్రం డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ చిత్ర వివరాల గురించి త్వరలోనే తెలియచేస్తాను అని కోటేంద్ర వివరించారు.