భార్యా భర్తలుగా మా ప్రయాణం ముగిసింది!

ప్రముఖ హీరో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఈరోజు ఆయన అధికారికంగా ప్రకటించారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు మనోజ్‌. అలాగే ఈ సమయంలో తనకు కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ,అభిమానులకు రుణపడి ఉంటానని తెలిపారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని చెప్పారు….
 
“నా వ్యక్తిగత జీవితం.. కెరీర్‌కు సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను… భార్యభర్తలుగా మా ఇద్దరి ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మేం కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగింది. మా మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో.. చాలా ఆలోచించి.. కష్టమైనప్పటికీ ఎవరి దారి వాళ్లు చూసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడిపోయినప్పటికీ..మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది. మీరందరు కూడా ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచి మా ప్రైవసీని గౌరవిస్తారని భావిస్తున్నాను”
 
“కొంతకాలంగా నా మనసు బాగోకపోవడంతో.. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. అలాగే సినిమాల్లో నటించలేకపోయాను. ఈ సమయంలో నా కుటుంబం చాలా అండగా నిలిచింది. వారు నా వెంట లేకపోతే ఈ కష్ట సమయాన్ని అధిగమించలేకపోయేవాడిని. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక పని సినిమాల్లో నటించడం.. అందుకోసం నేను తిరిగొచ్చాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల వల్లే. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి” అని మనోజ్‌ చెప్పారు . గతంలో మనోజ్‌ దంపతులు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చిప్పటికీ మనోజ్‌ వాటిని ఖండించారు. 2015లో మనోజ్‌, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది