పాత్రికేయురాలు, సినీ దర్శకురాలు బి.జయ మృతి !

పాత్రికేయురాలు, సినీ దర్శకురాలు బి.జయ(54) గురువారం రాత్రి  హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయ..తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం ‘సూపర్‌ హిట్‌’ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు. దర్శకత్వం పట్ల ఆసక్తితో ఆ రంగంవైపు అడుగేశారు. 2003లో తొలిసారి ‘చంటిగాడు’ సినిమాను దర్శకత్వం చేసి తనను తాను నిరూపించుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ‘ప్రేమికులు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘సవాల్‌’, ‘లవ్లీ’..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ‘వైశాఖం’ ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం.ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. ఆమె స్వయంగా తన చిత్రాలను తానే ఎడిటింగ్‌ చేసుకుంటారు. తెలుగు సినీ రంగంలో తొలి మహిళా ఎడిటర్‌గానూ ఖ్యాతి గడించారు.
మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌ శ్రద్ధాంజలి
గుండెపోటుతో కన్నుమూసిన తెలుగు సినీ దర్శకురాలు బి.జయకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌, వంశీ పైడిపల్లి, సుకుమార్‌, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్‌, గుణశేఖర్‌, నృత్యదర్శకుడు శేఖర్‌, మంచుమనోజ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.