ఇంతకీ మోక్షజ్ఞ తొలి దర్శకుడెవరు ?

నందమూరి మోక్షజ్ఞ… మోక్షజ్ఞను తెరకు పరిచయం చేయబోయే దర్శకుల జాబితా కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్టీఆర్ వారసుడిగా అరంగేట్రం చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక అభిమాన గణం సంపాదించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఆయన ఒకరిగా ఎదిగారు. నందమూరి ఫ్యామిలీకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ తమ నటనతో అభిమానులను అలరించారు.అయితే ప్రస్తుతం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై గత రెండేళ్లుగా రకరకాల వార్తలు సినీ పరిశ్రమల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మోక్షజ్ఞను తెరకు పరిచయం చేయబోయే దర్శకుల జాబితా కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. మొదట బోయపాటి శ్రీను ఆ తరువాత క్రిష్‌తో పాటు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుల పేర్లు వినిపించాయి.
 
తాజాగా ఈ జాబితాలోకి మరో దర్శకుడి పేరు చేరింది. యువ హీరోలను వెండితెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడని పేరున్న డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడని తాజాగా వినిపిస్తున్న టాక్‌. ఇంతకుముందు కూడా పూరీ… చిరు తనయుడు రామ్‌చరణ్‌, పునీత్‌ రాజ్‌ కుమార్‌, ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాస్, యూత్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీలను తెరకెక్కించటంలో పూరి స్పెషలిస్ట్‌. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీకి పూరీ అయితే కరెక్టుగా హ్యాండిల్ చేయగలడని బాలయ్య భావిస్తున్నాడట. దాంతో పూరి డైరెక్షన్‌లో మోక్షజ్ఞను పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరోవైపు మోక్షజ్ఞ తన ఎంట్రీ మూవీ గురించి నటనలో శిక్షణ పొందుతున్నాడని సమాచారం.
 
అయితే, మరి ఎక్కువ పాళ్లలో యాక్షన్, డైలాగ్స్ జోలికి వెళ్లకుండా సాఫ్ట్ గా మూవీ ఉండాలనేది బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది. పూరి దర్శకత్వంలో బాలయ్య ‘పైసా వసూల్‌’ మూవీ చేశాడు. ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తి భిన్నంగా చూపించి పూరి సక్సెస్ అయ్యాడు.ఇదిలాఉంటే ప్రస్తుతం పూరి ట్రాక్‌ రికార్డ్ అంత బాగోలేదు. ఇటీవల తనయుడు ఆకాష్ తో చేసిన ‘మెహబుబా’ సినిమా పరాజయం పాలైంది. అంతకుముందు వరుస ప్లాపులతో పూరి సతమతమవుతున్నాడు. అలాంటి డౌన్ ఫాల్ లో ఉన్న పూరి చేతుల్లో బాలయ్య తన తనయుడిని పెడతాడా? అన్నది సందేహం. మోక్షజ్ఞను వెండి తెరకు పరిచయం చేసే దర్శకుడు ఎవరన్నది తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచి చూడాలి…