నయనతార స్టార్‌ హీరోల ఫార్ములా !

నయనతార.. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్‌ హీరోలతో నటిస్తోంది. ఇందులో ఓ లాజిక్‌ ఉంది. కుర్రహీరోలతో నటించే చిత్రాలకు కాల్‌షీట్స్‌ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్‌ హీరోల చిత్రాల్లో అంతగా నటించాల్సిన అవసరం ఉండదు. నయనతార ఆరంభం నుంచే ‘లక్కీ’ అనే చెప్పాలి. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలు విజయ్, అజిత్, సూర్య, శింబు, విశాల్‌ తో జత కట్టింది. ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌తో ‘చంద్రముఖి’ తో పాపులర్‌ అయ్యింది. అలా స్టార్‌ హీరోలతో చేసి క్రేజ్‌ను సంపాదించుకున్న నయనతార ఆ తరువాత.. విజయ్‌సేతుపతి, శివకార్తీకేయన్, ఆరి వంటి యువ హీరోలతో నటించింది. అలాంటి చిత్రాల విజయాలు నయనతార కే ఎక్కువ ప్లస్ కావడంతో… హీరోయిన్‌ ఓరియంటేడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది.
 
నయనతార ఎప్పుడూ వార్తల్లో ఉంటూ తన పాపులారిటీని పెంచుకుంటూ ఇప్పుడు సుమారు 6 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోల బదులు స్టార్‌ హీరోలతోనే నటించడం మొదలెట్టింది. స్టార్‌ హీరోల చిత్రాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఆమె నటించిన ‘సైరా నరసింహారెడ్డి’, తమిళంలో విజయ్‌తో నటించిన ‘విజిల్’, రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్‌’ చిత్రాలలో నయనతార పాత్ర చాలా తక్కువ. పారితోషికం మాత్రం 4 కోట్లకు పైనే అట.
 
తక్కువ కాల్‌షీట్స్‌తో ఎక్కువ పారితోషికం లభించడమే నయనతార స్టార్‌ హీరోలతో నటించాలనే నిర్ణయానికి కారణం . ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హీరోతో రెండు పాటలలో లెగ్‌ షేక్‌ చేయడం.. మరో నాలుగు సన్నివేశాల్లో కనిపించడం చేస్తే చాలు. ఆ చిత్రాల విజయాలు ఎలాగూ తన ఖాతాలోనూ పడతాయి. ఇప్పుడు ‘విజిల్’,’దర్బార్‌’ వంటి చిత్రాల విజయాలను నయనతార షేర్‌ చేసుకుంటోంది. అందుకే స్టార్‌ హీరోల ఫార్ములా అన్ని విధాలుగా బాగుందని నయనతార భావిస్తోంది. ఇక హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో ఎలానూ తన ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఆ తరహా చిత్రాలూ చేస్తోంది.
ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో…
‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార మరోసారి ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌తో ‘అన్నాత్తా’ చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కథానాయకి ప్రాముఖ్యత కలిగిన ‘మూక్కుత్తి అమ్మన్‌’ అనే భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మాతగా రౌడీ పిక్చర్స్‌ పతాకంపై ‘వెట్రికన్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం కావడం విశేషం.నయనతార త్వరలో విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించనున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ అనే ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుంది. విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్న ఈ చిత్రంలో సమంత మరో నాయకిగా నటించనుంది.