మన సినిమాని ఉన్నత స్థానంలో నిలపడమే నా కల!

భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా..అగ్ర స్థానంలో నిలబెట్టాలన్నదే నా కల. అందుకోసం నా వంతుగా కొత్త ప్రతిభను వెలికి తీసి..అవకాశాలు కల్పించాలనుకుంటున్నా‘ అని అంది ప్రియాంక చోప్రా. ‘మన సినిమాని ప్రపంచంలో అత్యుత్తమ పరిశ్రమగా నిలపడమే నా డ్రీమ్‌. అందుకోసం నా వంతు కృషి చేస్తా. మన భారతీయ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తా’ అని అంటోంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో భాగమై గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా ఇటీవల బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటించి ఆకట్టుకుంది.
” ‘జై గంగాజల్‌’ (2016) తర్వాత హిందీ సినిమా చేయాలనుకున్నాను. చాలా కథలు కూడా విన్నాను. అప్పటికే అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ టెలికాస్ట్‌ కూడా మొదలైంది. ఈ సిరీస్‌ త్రీ సీజన్స్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎక్కువ టైమ్‌ పట్టేసింది. హిందీ సినిమా చేయాలని ఉన్నా చేయలేకపోయాను.‘ది స్కై ఈజ్‌ పింక్‌’తో మళ్లీ హిందీ ప్రేక్షకులకు కనిపించాను.ఈ మూడేళ్లల్లో సినిమాలపరంగా చాలా మార్పొచ్చింది”
 
వరల్డ్‌ సినిమాల్లోకి ఇదే సరైన సమయం
‘హాలీవుడ్‌ ఆఫర్‌ రావడం అంత ఈజీగా జరగలేదు. ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎవరూ తెలియదు. రూమ్‌లోకి వెళ్ళి నేను భారతీయ నటిని. పలానా సినిమాలు చేశానని పరిచయం చేసుకున్నా. బలమైన మహిళా పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నా అని తెలిపాను. నేను అక్కడ ఏం చేయాలనుకుంటున్నానో..ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పాను. అది నచ్చే ఆఫర్‌ ఇచ్చారు…అని చెప్పింది ప్రియాంక.
మా ‘పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌’పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్‌’కి మూడు నేషనల్‌ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సినిమాలను, తమను కదిలించే కథలను చూడ్డానికి ఆడియన్స్‌ ఇష్టపడుతున్నారు. వరల్డ్‌ సినిమాల్లో ఉండటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను…అని అంది .
ప్రస్తుతం ప్రియాంక ‘విరు కెన్‌ బి హీరోస్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. రాబర్ట్‌ రోడ్రిగ్విజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు
బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమా పరిశ్రమలో ఒంటరిగా కెరీర్‌ మొదలుపెట్టింది ప్రియాంకా చోప్రా.
‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అన్నారామె. ‘‘ఒక సినిమాలో భాగమవ్వాలంటే హీరోయిన్లు చాలామందిపై ఆధారపడాల్సి వస్తుంది. అది నిజంగా దురదృష్టం. అలా ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో.. అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది. సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యమే నన్ను నిర్మాతగా మార్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా..హీరోయిన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాను. నా అనుభవంతో చెబుతున్నాను.. ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు. అందుకే మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి’’ అన్నారు.