సోషల్‌ మీడియాలో ప్రియాంక పెట్టుబడి

“జీవితంలో కొత్త అధ్యాయం. రెండు సంస్థలతో కలిసి వ్యాపారం చేయబోతున్నందుకు చాలా ఆతృతగా ఉంది. లింగ వివక్ష లేకుండా మెరుగైన సమాజం కోసం తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కష్టపడుతున్న రెండు టెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది” అని ప్రియాంక చోప్రా అన్నారు.
బాలీవుడ్‌ స్టార్స్‌ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారాల్లో దూసుకుపోవడం పరిపాటే. అలా చాలా మందే ఈ జాబితాలో ఉంటారు. అందులో మహిళలు మాత్రం సంఖ్య పరంగా తక్కువ మంది ఉంటారు. ప్రియాంక చోప్రా ఒక పక్క నటిగా రాణిస్తూనే మరో పక్క వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె అమెరికన్‌ ‘క్వాంటికో’ సిరీస్‌లో నటించాక నిర్మాతగా కూడా మారారు. తన ప్రొడక్షన్‌ బాధ్యతలను ఆమె తల్లి మధు చోప్రా చూస్తున్నారు. ప్రియాంక ప్రొడక్షన్‌లో మరాఠీ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు.
‘జీవితంలో కొత్త అధ్యాయం. రెండు సంస్థలతో కలిసి వ్యాపారం చేయబోతున్నందుకు చాలా ఆతృతగా ఉంది. లింగ వివక్ష లేకుండా మెరుగైన సమాజం కోసం తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కష్టపడుతున్న రెండు టెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’ అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.’హోల్బర్టన్‌ స్కూల్‌’ అనే కోడింగ్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీతో పాటు ‘బంబుల్‌’ అనే డేటింగ్‌ సోషల్‌మీడియా యాప్‌లో ప్రియాంక పెట్టుబడి పెట్టబోతుంది. ఇందుకోసం ఇటీవల ప్రియాంక శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లింది. హోల్బర్టన్‌ స్కూల్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి 8.2 మిలియన్‌ డాలర్లు. ఇందులో ప్రియాంక వాటా కూడా ఉంది. నిరుపేద పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రియాంక ఎడ్యుకేషన్‌ కంపెనీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ రెండు కంపెనీలను స్థాపించింది మహిళలే కావడం విశేషం.
తాను కేవలం డబ్బు సంపాదించడానికే పెట్టుబడిదారునిగా మారలేదని …ఈ కంపెనీల ద్వారా మహిళలు, పేద పిల్లలు లాభపడితే తనకు అంతే చాలని ప్రియాంక ఈ సందర్భంగా మీడియాకు తెలిపింది. ‘బంబుల్‌’ డేటింగ్‌ యాప్‌ను భారత్‌లోనూ ప్రవేశపెట్టడానికి ప్రియాంక సన్నాహాలు చేస్తున్నారు. ‘బంబుల్’లో పెట్టుబడి పెట్టిన ప్రియాంక ఈ యాప్ లాంచింగ్, వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నట్లు యాప్ సీఈఓ విట్నే వోల్ఫ్‌హెర్డ్ చెప్పారు. ఇప్పుడున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు మహిళలకు అంత సురక్షితం కాకపోవడంతో తమ యాప్‌లో వారి భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. గత ఏడాది లాంచ్ అయిన ఈ యాప్ 160 దేశాలలో పనిచేస్తోంది. 2.7 కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు