ఓటీటీ రంగంలోనూ రాజ‌మౌళి,దిల్‌రాజు ముద్ర

పాన్ ఇండియా ద‌ర్శ‌క‌ ‘బాహుబ‌లి’ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి… ఈ కరోన సమయంలో ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఓటీటీ వైపు అడుగు లేయ‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి.తన ప్రతిభతో ’దర్శకధీరుడు’ అని పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రొడ్యూసర్‌గా మారి అప్పట్లో  సినిమా కూడా నిర్మించాడు. రాజమౌళి,  ఎన్టీఆర్ కాంబినేషన్‌లో  వచ్చిన ’యమదొంగ’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి రాజమౌళి నిర్మాతగా కూడా వ్యవహరించారు. రమా రాజమౌళి సమర్పణలో విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్‌లో రాజమౌళి ’యమదొంగ’ సినిమా నిర్మించాడు. ఆ తర్వాత రాజమౌళి ’అందాల రాక్షసి’ సినిమాను సాయి కొర్రపాటితో కలిసి ప్రొడ్యూసర్‌గా రూపొందించాడు. అయితే ఈ సినిమా విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందలేదు.

ఈ మధ్య వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ సినిమాలకు ఆదరణ లభిస్తుండటంతో రాజమౌళి తిరిగి ప్రొడక్షన్‌లోకి దిగే ఆలోచన చేస్తున్నాడట. తానే సొంతంగా కొన్ని ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్‌లు నిర్మించి డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి.. తాను డిజిట‌ల్ రంగంలోకి రావ‌డానికి ఆస‌క్తిగానే ఉన్నాన‌ని చెప్పారు.. దర్శకుడు క్రిష్ ఇప్ప‌టికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు పూరీ జ‌గ‌న్నాథ్‌, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. వీరి బాట‌లోనే రాజ‌మౌళి ఓటీటీ కంటెంట్‌ను సిద్ధం చేయ‌బోతున్నార‌ట‌. రాజ‌మౌళి ఓటీటీ కంటెంట్‌కు తాను నిర్మాత‌గా మారి దర్శకత్వం అవ‌కాశం నవ యువ దర్శకులకు ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లతో భారీ బడ్జెట్ చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దీని తర్వాత మహేష్ బాబు తో సినిమా చేస్తారు.

 
ఓటీటీ రంగంలోనూ దిల్‌రాజు ముద్ర
తెలుగు చిత్ర రంగంలో ప్ర‌స్తుతం అగ్ర నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు ఓటీటీ రంగంలో అడుగు పెట్ట‌నున్నారు. అయితే దిల్‌రాజు నేరుగా ఓటీటీ రంగంలోకి అడుగు పెట్ట‌డం లేదట. ఓటీటీ కంటెంట్‌ను త‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారట‌. హిట్ డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను క‌థ‌తో ఎడిట‌ర్ గ్యారీ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్ సేన్ నిర్మాణంలో ఓటీటీ సినిమా త‌యారు చేస్తున్నార‌ట‌. త‌ర్వాత ఆ ప్రాజెక్ట్‌ను ఓటీటీ వారికి సేల్ చేసే ఆలోచ‌న‌లో దిల్‌రాజు ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో రాణిస్తోన్న దిల్‌రాజు ఓటీటీ రంగంలోనూ త‌న ముద్ర వేయాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.