రజనీకాంత్‌ ద్విపాత్రల ‘దర్బార్‌’ సంక్రాంతికి

రజనీకాంత్‌ ప్రస్తుతం ‘దర్బార్‌’లో నటిస్తున్నారు. ఆయన వయసు పెరిగే కొద్దీ సినిమాల స్పీడూ పెంచుతున్నారు. ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్‌’ ని లైకా సంస్థ నిర్మిస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ తో ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని… ప్రస్తుతం పుణెలో చిత్రీకరణ జరుగుతోంది. చిత్రీకరిస్తున్న క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయట. దీంతో టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. పాటల షూటింగ్‌ మిగిలి ఉంటుంది. పాటలన్నీ విదేశాల్లో చిత్రీకరిస్తారు.ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓ పాత్రలో పోలీస్‌ అధికారిగా, మరో పాత్రలో సామాజిక వేత్తగా కనిపిస్తారట.రజని పోలీస్‌ గెటప్‌కి చెందిన ఫొటోలు ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి. పోలీస్‌ గెటప్‌లో రజనీ చాలా యంగ్‌గా కనిపించడం అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే ఫ్యాన్స్‌ని మరింత హ్యాపి చేసేందుకు త్వరలోనే టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారు. టీజర్‌ని విజయదశమి కానుకగా ఇచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి ‘దర్బార్‌’ రిలీజ్‌ చేయనున్నారు.
ఆ తర్వాత రజనీకాంత్‌ మరో రెండు సినిమాల్లో నటించనున్నారు. అందులో ఒకటి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో, మరొకటి హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌తో రజనీకాంత్‌ ఇప్పటికే ‘ముత్తు’, ‘నరసింహా’, ‘లింగా’ చిత్రాలను రూపొందించారు. వీరి కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం. హెచ్‌ వినోద్‌తో ఇదే తొలి చిత్రం.