ఆశ చావక సగానికి తగ్గించింది !

టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న రకుల్‌ ఇటీవల తెలుగు సినిమాలు తగ్గించి బాలీవుడ్‌, కోలీవుడ్‌పై దృష్టిసారించింది. బాలీవుడ్‌లో నటించాలని ఏ కథానాయిక అయినా సరేే ఏదో ఒక దశలో ఆశ పడక మానరు. ఒకవేళ ఆశించినట్టు అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ చేసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు పారితోషికం విషయాన్ని కూడా ఆలోచించరు. అలాంటి కోవలోకే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేరింది. బాలీవుడ్‌లో రాణించేందుకు రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుందట.
ఇప్పటికే ఆమె బాలీవుడ్‌లో ‘యారియాన్‌’, ‘అయ్యారి’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఎలాగైనా బాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకోవాలని తపిస్తోంది. దీని కోసమై తాజాగా అజయ్ దేవగన్‌ సరసన నటిస్తున్న ‘దే దే ప్యార్‌ దే’ సినిమా కోసం ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ సగానికి తగ్గించిందని చిత్ర దర్శకుడు అకీవ్‌ అలీ వెల్లడించారు. ‘రకుల్‌ తెలుగులో తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ భారీగా తగ్గించి మా సినిమాలో నటిస్తోంది’ అని ఆయన తెలిపారు. బాలీవుడ్‌ చిత్రాలు పరాజయం చెందడం కూడా ఆమె రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవడానికి కారణమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మానసికంగానూ కాస్త విశ్రాంతి అవసరం
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టినా కోలీవుడ్‌లో సూర్యకు జంటగా ‘ఎన్‌జీకే’, కార్తీతో ‘దేవ్’, శివకార్తీకేయన్‌ సరసన ఒక చిత్రం అంటూ బిజీగా ఉంది. ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ఇంటి ముఖం చూసి చాలా కాలం అయ్యిందని బెంగ పట్టుకుంది. మనసు అటు వైపు లాగుతోంది అంటోంది రకుల్‌.
“నాకు నటన అంటే చాలా ఆసక్తి. ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసి కొత్త చిత్రాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుముందు నటన నుంచి కాస్త విరామాన్ని కోరుకుంటున్నాను. అనంతరం మళ్లీ నూతనోత్సాహంతో నటించడానికి రెడీ అవుతాను. గత జూలై నెల పూర్తిగా లండన్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ తరువాత తమిళ చిత్రం కోసం ఉక్రెయిన్‌ వెళ్లాను. అక్కడు షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చాను.ఆ తరువాత చెన్నై పరసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఇలా బిజీగా నటిస్తుండడంతో ఇంటిపై బెంగ పట్టుకుంది. ఇంటి భోజనం తిని చాలా కాలం అయ్యింది. మానసికంగానూ కాస్త విశ్రాంతి అవసరం”…. అని అంటోంది .