అతిపెద్ద థియేటర్‌ ‘వి ఎపిక్’ ను ప్రారంభించిన రామ్‌చరణ్‌

దేశంలోని అతిపెద్ద సినిమా తెరను టాలీవుడ్‌ నటుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను నిర్మించారు. సూళ్లూరుపేట మండలం పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకోని పిండిపాలెం లోని ఒకే ప్రాంగణంలో నూతన టెక్నాలజీ తో నిర్మించిన వి ఎపిక్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్‌ను నిర్మించింది. రామ్‌చరణ్‌ ప్రారంభించిన ఈ థియేటర్‌లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.
ప్రారంభోత్సవం అనంతరం థియేటర్లోనే పలు సినిమా ట్రైలర్లను తిలకించారు. ఒకే ప్రాంగణంలో మూడు తెరలతో మంచి డిజిటల్ సౌండ్ తో థియేటర్ ను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. సూళ్లూరుపేట అభివృద్ధి పథంలో ఉన్నందున అన్ని నూతన టెక్నాలజీకి సంబంధించిన ఇలాంటివి ఉండడం మన నెల్లూరు జిల్లా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ…వంశీ రెడ్డి,విక్రమ్ రెడ్డి,వారి పెద్దలకు శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ప్రాంతం అనగానే గుర్తుకొచ్చేది… ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచపటంలోనే ప్రాధాన్యత కలిగిన షార్ ప్రాజెక్టు.కొద్దిరోజులలో చందమామని ప్రపంచమంతా చూపించగలిగే స్థాయి షార్ ప్రాజెక్టు అది. అలాగే నేలపట్టు,పులికాటు,మాంబట్టు ఇలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఈ సూళ్లూరుపేట సమీపంలో ఉన్నాయి. అటువంటి సూళ్లూరుపేట లో వి ఎపిక్ థియేటర్ నిర్మాణం చేసి సూళ్లూరుపేట ప్రాధాన్యతను చాటుకున్నారని తెలియజేశారు.30 వ తారికు నుండి సినిమాలు వీక్షించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి,వేనాటి రామచంద్రా రెడ్డి,పెళ్లకూరు సత్యనారాయణ రెడ్డి,వైసిపి నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, వైయస్సార్సీపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దబ్బల శ్రీమంత్ రెడ్డి,యువ నాయకుడు శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.