చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఇప్పటి హీరోలు !

అమీర్ ఖాన్, రాజమౌళి, త్రివిక్రమ్, మహేష్ బాబు తోవలోనే  రామ్ చరణ్ నడుస్తున్నాడు.  పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటాలడగడం.. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్. ఇదే ఫార్ములాను రామ్ చరణ్.. తన లేటెస్ట్ మూవీపై అప్లై చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఆ హీరో, నిర్మాతతో దీనికి సంబంధించిన డీల్ కుదుర్చుకున్నాడట. గన్‌షాట్ హిట్ అనుకొనే సినిమాల మీద ఎవరైనా ఎంత పెట్టుబడి అయినా పెట్టవచ్చు. అయితే ఆ పెట్టుబడి పెట్టేది ఆ సినిమా హీరోనే అయితే.. అది ఖచ్చితంగా నిర్మాతకు ఆనందం కలిగించే విషయమే. ‘‘వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్’’ చిత్రాల విషయంలో రామ్ చరణ్ పారితోషానికి బదులుగా లాభాల్లో వాటాలు అడగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత డి.వి.వి దానయ్యతో  డీల్ కుదుర్చుకున్నాడట చెర్రీ.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ మల్టీస్టారర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే దీనికన్నా ముందే చెర్రీతో దానయ్య ‘వినయ విధేయ రామ’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్‌కు క్రేజ్ దృష్ట్యా 18 నుంచి 20 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. `రంగస్థలం` చిత్రం ఘనవిజయంతో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో దానయ్య ఒక్కో ప్రాజెక్టుకు 20 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడుట. అలా దానయ్య నిర్మిస్తోన్న ఈ రెండు సినిమాలకు కలిపి తనకు పారితోషికంగా రావల్సిన మొత్తం రూ. 40కోట్లను ఆర్.ఆర్.ఆర్ మీద పెట్టుబడిగా పెడుతున్నాడట చెర్రీ. సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పాడట రామ్ చరణ్.
నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విషయంలో దానయ్య మరో ఇన్వెస్టర్‌ను కలుపుకోవాలని చూస్తున్నాడట. అందుకే చెర్రీ ప్రపోజల్‌కు ఆనందంగా ఓకే చెప్పాడట దానయ్య. సినిమాల నిర్మాణంలో దానయ్యకు  సపోర్ట్‌గా ఉన్నట్లు ఉంటుంది… భాగస్వామిగా  పారితోషికాన్ని మించి లాభాలు సంపాయించే అవకాశం  కూడా ఉండటం రామ్ చరణ్ తెలివైన ఆలోచనే కదా …