నిలబడాలంటే సక్సెస్‌ కావాలి !

అతి తక్కువ కాలంలో ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాశిఖన్నా తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఓ బంపర్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న తన చిత్రాల్లో ఏదో ఒక చిత్రం డెఫినెట్‌గా మెగాహిట్‌ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. రాశీ ప్రస్తుతం గోపీచంద్‌ సరసన ‘ఆక్సీజన్‌’, తమిళంలో ‘సైతాన్‌ కా బచ్చా’, ‘ఇమైక్కా నోడిగల్‌’, మలయాళంలో మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘విలన్‌’, తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ‘జై లవకుశ’, రవితేజకి జోడీగా నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘మద్రాస్‌ కేఫ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఆ తర్వాత ‘మనం’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.’జోరు’, ‘జిల్‌’, ‘శివమ్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సుప్రీమ్‌’, ‘హైపర్‌’ చిత్రాల్లో నటించింది. వీటిల్లో ‘సుప్రీమ్‌’, ‘హైపర్‌’ మాత్రమే చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించినప్పటికీ రాశి కెరీర్‌కి మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో ఆమెకిప్పడు ఓ మెగా హిట్‌ అత్యవసరమైంది. ఈ విషయమై మీడియాతోరాశి మాట్లాడుతూ,’ఏ భాషకి సంబంధించిన పరిశ్రమలోనైనా సరే నటీనటులు నిలబడాలంటే సక్సెస్‌ తప్పని సరి. ప్రస్తుతం నేను కూడా ఓ భారీ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఊహిస్తున్న సక్సెస్‌ని త్వరలోనే వస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.