నేను అసలు పెళ్లే చేసుకోను !

సాయి పల్లవి… మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో వచ్చిన క్రేజ్‌తో ఈ భామకు వరుసగా మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ఈ భామ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది . ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది సాయిపల్లవి. హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను దక్కించుకున్న ఈ భామ పెళ్లిపై స్పందించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? ప్రేమ వివాహం చేసుకుంటావా? అని ప్రశ్నిస్తే… సాయి పల్లవి వెరైటీగా సమాధానమిచ్చింది…. “నేను అసలు పెళ్లే చేసుకోను”అని చెప్పింది. జీవితాంతం తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటానంటోంది ఈ అమ్మడు. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తోంది. పెళ్లిపై అమ్మడు స్పందించిన తీరుకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక వైద్య విద్యను అభ్యసించిన ఈ బ్యూటీ… గతంలో కొన్ని ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లోనూ పాల్గొంది. మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవికి ఇప్పుడు సౌత్‌లో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉంది.
ఆశలన్నీ ఆచిత్రంపైనే…
సాయి పల్లవి తొలి చిత్రం ఆమెకు బాగానే వర్కౌట్‌ అయ్యింది. అదే మ్యాజిక్‌ తెలుగులోనూ రిపీట్‌ అయ్యింది. తెలుగులో సాయిపల్లవి నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఇంకా సక్సెస్‌ దక్కలేదు. ఇక్కడ తొలి చిత్రం ‘దయా’ సాయిపల్లవిని చాలా నిరాశ పరచింది. ఆ తరువాత ధనుష్‌తో జత కట్టిన ‘మారి–2’ ఓకే అనిపించుకుంది.
 
ఇప్పటివరకూ కోలీవుడ్‌లో సాయిపల్లవికి మంచి హిట్‌ పడలేదు. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం మినహా మరో అవకాశం సాయి పల్లవి చేతిలో లేదు. దాంతో ప్రస్తుతం సాయి పల్లవి ఆశలన్నీ ‘ఎన్‌జీకే’ చిత్రంపైనే పెట్టుకుందట. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. సమ్మర్‌లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మరో హీరోయిన్‌గా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా నటించింది. ప్రస్తుతం సాయిపల్లవి మాతృభాషలో ఫాహత్‌ ఫాజిల్‌తో ఒక చిత్రం చేస్తోంది.