బుల్లితెర ప్రోగ్రామ్ కి 78 కోట్లు : సల్మాన్ దమ్ము

రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తాజాగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై మెరవబోతున్నారు. విజయవంతమైన ‘దస్‌ కా దమ్‌’ మూడో సిరీస్‌కు సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ప్రోమోను ఈ కండల వీరుడు తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇలాంటి టీవీ షోలను ఆసక్తికరంగా నడిపించడంలో ఈ ‘దబాంగ్‌’ హీరోకు మంచి ప్రావీణ్యం ఉందనే చెప్పవచ్చు. తన ఆసక్తికర వాఖ్యలతో ప్రేక్షకులను కట్టిపడేయడం సల్మాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 20 వారాలపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికిగాను సల్మాన్‌ 78కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్‌ నుంచి ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమం ప్రారంభంకానున్నట్లు సమాచారం.

ఈ సారి ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమంలో సామాన్యులతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు టీవీ నటులు కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో నేషనల్‌ సర్వేకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. సమాధానాలను శాతాలలో (పర్సంటేజ్‌) చెప్పాల్సి ఉంటుంది. సరైన లేదా సమీప సమాధానం చెప్పినవారు 10 వేల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ గెలుచుకుంటారు.