పేదకళాకారులకు ‘సారిపల్లి కొండలరావు ఫౌండేషన్’ పురస్కారాలు

సాంస్కృతిక పునరుజ్జీవనానికి సారిపల్లి కొండల రావు చేసిన కృషి అభినందనీయమని విధానసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ‘సారిపల్లి కొండలరావు ఫౌండేషన్’ ఆధ్వర్యం లో విజయవాడలో మార్చి 26న పేదకళాకారులకు పురస్కారాలు ప్రదానం  చేశారు . ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ…  దయనీయ స్థితిలో  ఉన్న  రంగస్థల కళాకారులను  ఆదుకునేందుకు  సారిపల్లి కొండలరావు ఫౌండేషన్… ప్రదర్శనలు ఇప్పించడం,నగదుసహకారం ,పురస్కారాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు .

భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్  డి . విజయభాస్కర్  మాట్లాడుతూ …. కళాకారులను ఆదరించే కొద్దిమందిలో సారిపల్లి కొండలరావు  ముందుంటారని  అన్నారు. ఈ సభలో ఏ .పి . నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి  గోపాలకృష్ణ , సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు ప్రసంగించారు. అనంతరం కళాకారులు …. బండ్రపల్లి సుబ్బారావు (డప్పు), రేఖానార్ హనుమంతరావు (తోలుబొమ్మలాట), జి. సూరి (తప్పెట గుళ్ళు), ఎస్ .కృష్ణయ్య (పగటివేషగాళ్ళు), తూర్పాటి నారాయణ (హరికథ), యడవల్లి  సీతారామయ్య(బుర్రకథ), కె. దుర్గయ్య (యక్షగానం),అల్లం చంద్రశేఖర్రావు (నాటకం), నాగమల్లేశ్వరరావు (నాటకం),విజయలక్ష్మి (నాటకం) లను సన్మానించి, పది వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో సంస్థ అద్యక్షులు సారిపల్లికొండలరావు, కన్వీనర్ ‘యువకళావాహిని’ వై. కె. నాగేశ్వర రావు పాల్గొన్నారు .