సుమంత్ ‘ఇదం జగత్‌’ ట్రైలర్ ఆవిష్కరణ

సుమంత్ నటిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహిస్తుండగా అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది.విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది.
 
అతిథిగా హాజరైన అడవి శేష్ మాట్లాడుతూ “నేను బయటకు వచ్చి మాట్లాడే రకం కాదు. ఈ సినిమా కూడా చూడలేదు. కానీ నచ్చిన పాయింట్‌ అనిపిస్తేనే ఇలా మాట్లాడతాను. నాకు సినిమాటోగ్రఫీలో బొకే షాట్స్ ఇష్టం. అవుట్‌ ఫోకస్‌ లో లైట్స్ షైన్‌ అవుతుండటం. పోస్టర్‌లో ఉన్న అలాంటి షాట్స్ ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం అయ్యాయి. నా కెరీర్‌ ప్రారంభంలో ఇలాంటివి పోస్టర్స్‌లో వాడటానికి ప్రయత్నించాను. టీజర్‌, ట్రైలర్‌లో ‘ఇదం జగత్‌’ అనే టైటిల్‌ వచ్చినప్పుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది. ఆ బ్రాండింగ్‌, కనెక్షన్ రెండింటికీ ఇవ్వడం శ్రీచరణ్‌లో నాకు నచ్చింది. వీరంతా నాకు ఫ్రెండ్సే. కానీ ఈ సినిమా విషయంలో మేటర్‌ నచ్చి వచ్చా… అందుకే మాటలు చెపుతున్నా. ట్రైలర్‌, పోస్టర్స్‌ తరహాలో సినిమా కూడా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
 
నిర్మాతల్లో ఒకరైన పద్మావతి మాట్లాడుతూ “సుమంత్‌ గారు ఇలాంటి స్టోరీ యాక్సప్ట్ చేస్తారా అనుకున్నాం. కానీ ఆయన ఓకే చెప్పడమే సర్ప్రైజ్ అనిపించింది. సుమంత్‌ గారి కెరీర్‌లో ఇది డిఫరెంట్‌ మూవీ. ఇలాంటి పాత్రలు కూడా ఆయన చేయగలరు అని ఈ సినిమాతో ప్రూవ్‌ అయింది. ఈ సినిమాకు పైకి కనిపించే హీరో సుమంత్‌ గారైనా తెరవెనుక హీరో దర్శకుడే. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు హార్ట్. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆయనకు థ్యాంక్స్‌. కెమెరా వర్క్‌ బాగుంది. ప్రతీ ఒక్కరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది” అన్నారు.
 
మరో నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ “ట్రైలర్‌ లాంచ్‌ చేయడానికి వచ్చిన శేష్ గారికి థ్యాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. సుమంత్‌ గారు ఈ సినిమాకు కష్టపడ్డట్టు ఏ సినిమాకూ కష్టపడిఉండరు. రాత్రి, పగలు అని తేడా లేకుండా షూటింగ్‌ చేశారు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌’ తెలిపారు.
 
దర్శకుడు అనిల్‌ మాట్లాడుతూ “అవకాశం ఇచ్చిన నిర్మాతలు పద్మావతి, శ్రీధర్ గార్లకు థ్యాంక్స్. ఇది టెక్నీషియన్స్ మూవీ. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా ఈరోజిలా బాగా వచ్చింది. అందరికీ థ్యాంక్స్” తెలియజేశాడు.
 
సుమంత్‌ మాట్లాడుతూ “శ్రీధర్ గారు చెప్పినట్టు నేను అంతగా ఏం కష్టపడలేదు. రాత్రి షూటింగ్స్ నాకు చాలా చాలా ఇష్టం. ట్రైలర్‌ లో చూపించినట్టు రాత్రివేళలో షూటింగ్‌ చేశాం. ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం. మనిషిలో మంచి, చెడుతో పాటు అన్ని కోణాలు ఉంటాయి. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ క్యారెక్టర్‌ కోసం పెద్దగా కష్టపడలేదు. నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్‌లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల నాకు మొదట ఆసక్తి ఉండేది కాదు. రెండేళ్ల క్రితం నా మిత్రుడు అడవి శేష్‌ వల్ల ఆ ఆసక్తి పుట్టింది. అతను నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలు నాలో మార్పు తెచ్చాయి. నాకిప్పుడు ఈ జానర్‌ అంటే పిచ్చి. అందుకే ఈ జానర్‌లో చేస్తున్నాను. థ్యాంక్స్ శేష్‌. ఈసినిమా కోసం నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. ‘మళ్లీరావా’ రిలీజ్‌కు ముందు నవంబర్‌లో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాలో చాలా కొత్తగా ప్రయత్నించాం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. హార్ట్ ఆఫ్‌ ది ఫిల్మ్ శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం. విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం” అన్నారు.