సోషల్‌మీడియా నేపథ్యంలో ‘దొంగోడొచ్చాడు’

అమలాపాల్, బాబీసింహా, ప్రసన్న ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘దొంగోడొచ్చాడు’. కల్పతి ఎస్.అఘోరన్ సమర్పణలో ఎ.జి.ఎస్ ఎంట‌ర్ టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. సుసి గణేశన్ దర్శకుడు. కల్పతి ఎస్.అఘోరన్, కల్పతి ఎస్.గణేశ్, కల్పతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో…

బాబీ సింహ మాట్లాడుతూ ‘‘తమిళంలో ‘తిరుట్టుపయలే 2’ సినిమాను తెలుగులో ‘దొంగోడొచ్చాడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళంలో సినిమా నవంబర్ 30న విడుదలవుతుంటే, తెలుగులో సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయుడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సినిమా సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ‘మల్లన్న’ సినిమాను డైరెక్ట్ చేసిన సుశి గణేశన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రసన్న నటించిన సన్నివేశాలను చూసి ఆశ్చర్యపోయాను. తను ఎంతో అద్భుతంగా నటించారు. విద్యాసాగర్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం వింటూ ఇక్కడికి వచ్చినవాడిని. ఆయన సంగీతంలో రూపొందిన సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో సినిమాను నిర్మించారు’’ అన్నారు.

అమలాపాల్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ నగరంతో మంచి అనుబంధం ఉంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లోకి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉన్న ఓ అమ్మాయి జీవితం సోషల్ మీడియా కారణంగా ఎలా మారిందనేదే సినిమా. సుశిగారితో ఏడాదికో సినిమానైనా చేయాలనుకుంటున్నాను. ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ బ్యానర్‌లో నేను చేసిన రెండో సినిమా ఇది. విద్యాసాగర్‌తో మలయాళంలో పనిచేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు.

విద్యాసాగర్ మాట్లాడుతూ ‘‘చాలా సామాజిక కోణాలను విశ్లేషించే సినిమా ఇది. డైరెక్టర్ సుశి గణేశన్‌కి అన్ని విషయాలపై మంచి పట్టుంది. రీరికార్డింగ్ సహా పలు విషయాలపై ఆయన మాట్లాడుతున్నారు. పాటలు ప్రత్యేకంగా ఉంటాయి’’ అన్నారు.

ప్రసన్న మాట్లాడుతూ – ‘‘పది హేనేళ్ల క్రితం సినిమాల్లోకి రావాలనుకుంటున్న సమయంలో సుశి గణేశన్ నాకు అవకాశం ఇచ్చాడు. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఆయన దర్శకత్వంలోనే సినిమా చేయడం చూస్తుంటే సినిమా జీవితం సంతృప్తిగా  అనిపిస్తుంది. సినిమాలో విలన్‌గా, మంచి క్యారెక్టర్ చేశాను’’ అన్నారు.

సుశి గణేశన్ మాట్లాడుతూ ‘‘తమిళంలో విజయవంతమైన ‘తిరుట్టుపయలే2’ సినిమాకు ఇది సీక్వెల్. సోషల్ మీడియా నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రసన్న మంచి నటుడు. బాబీ సింహ పాత్ర నచ్చుతుంది. విద్యాసాగర్‌గారు మంచి సంగీతం అందించారు. ప్రతి పాత్రకు గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి వ్యక్తి అంతర్గతంగా వేరుగా ఉంటాడు. అవకాశం రావాలే కానీ..ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది’’ అన్నారు.