ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో గ్యాప్‌ తప్ప ముగింపు ఉండదు!

తమన్నా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది.దీంతో బాలీవుడ్‌లో తమన్నా కెరీర్‌ ముగిసిపోయిందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. వీటికి తమన్నా స్పందించింది…
“బాలీవుడ్‌లో నా పని అయిపోయిందంటూ ఇటీవల నెటిజన్లతోపాటు.. బాలీవుడ్‌ వర్గాలు కూడా కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాయి. అంటే బాలీవుడ్‌లో నా కెరీర్‌ ముగిసిందనే అభిప్రాయంలో వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేదొకటే.. ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో కొంత బ్రేక్‌ తప్ప, ముగింపు ఉండదు’ అని తమన్నా చెప్పింది.
“గత కొన్నేండ్లుగా 365 రోజులూ నేను షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉన్నాను. ఈ క్రమంలో ఎన్నో తెలుగు, తమిళ చిత్రాలను చేశాను. అయితే డేట్లను సర్దుబాటు చేయలేక బాలీవుడ్‌లో నటించలేదు. అంతేతప్ప, బాలీవుడ్‌లో అవకాశాలు రాక కాదు. నాకు అసలు అవకాశాలే రాకపోతే.. ప్రస్తుతం ‘బోల్‌ చుడియన్‌’ లో ఎలా నటించగలుగుతాను? దీని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో గ్యాప్‌ తప్ప ముగింపు ఉండదు. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ సరసన ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్నాను. నా కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలో యాక్ట్‌ చేస్తున్నా. తెలంగాణా కబడ్డి జట్టుకి కోచ్‌గా అచ్చు తెలంగాణ స్లాంగ్‌లో మాడ్లాడే క్యారెక్టర్‌లో నటిస్తున్నా” అని తమన్నా తెలిపింది.
 
ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే …
గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా.ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనున్నారు గోపీచంద్‌. ‘జ్వాల’పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో తొలిసారి ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేస్తున్నాను. తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను.శాకాహారిగా మారిపోయి, గ్లూటెన్‌ డైట్‌ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్‌గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ పర్ఫెక్ట్‌గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్‌ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నా’’ అని పేర్కొన్నారు తమన్నా.
 
తండ్రిని నిర్దోషిగా నిరూపిస్తా !
తమన్నా తొలి ‘వెబ్‌ సిరీస్‌’ ‘ది నవంబర్స్‌ స్టోరీ’ కథ ఇది. ఇదొక క్రైమ్‌ థిల్లర్‌. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు రామ్‌ సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తండ్రిని కాపాడే కూతురి పాత్రలో నటిస్తున్నారు తమన్నా.అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న తండ్రిని కాపాడటానికి కూతురిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు తమన్నా. మరి ఈ క్రైమ్‌ని ఛేదించి, తన తండ్రిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారనేది తెలియడానికి కొంచెం టైమ్‌ ఉంది. ఈ సిరీస్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ‘‘తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ‘హాట్‌స్టార్‌’లో ఈ సిరీస్‌ తెలుగు, హిందీ భాషల్లోనూప్రసారం కానుంది.