అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలే చేయబోతున్నా!

“దృశ్యం” సినిమాకు సీక్వెల్‌గా వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం దృశ్యం 2.  నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ చెప్పిన విశేషాలు…

‘సీటు అంచును కూర్చోబెట్టే సినిమాలు’ అంటారు కదా?..అలా ఉంటుంది దృశ్యం 2. రాంబాబు పాత్ర‌లో మ‌రోసారి న‌టించ‌డం చాలా హ్యాపీ..ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు ముఖ్య‌ ఉద్దేశ్యం.  సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని  అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు  ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం..ఏం జరిగిందనేది రాంబాబు ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం అతనికి  తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు.

దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్త‌గా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వ‌ను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం.

సినిమాలు తీశామా?  రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో.

రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఓ ఆరు నెలల తరువాత కూడా సినిమాలు చూస్తారు. బాగుందని అంటారు. ఓటీటీలోని అందం అదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లోంచి సినిమా వెళ్లి పోతుంద‌ని ముందు చూస్తారు. కానీ ఓటీటీలో తీరిగ్గా త‌ర్వాతైనా చూస్తారు.

నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. ‘నెక్ట్స్ సినిమాల‌తో థియేటర్లోకి వస్తాను’ అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. ‘ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి’ అనే బాధ ఎఫ్ 3తో పోతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నా అభిమానులు అర్థం చేసుకుంటారు. వారి ఓపిగ్గా ఉంటారు. ఎఫ్ 3 డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ అదే అవ‌స‌రం క‌దా..అందుకే త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి.

అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతున్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయాలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్ర‌మే నేను చేస్తాను. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. రానాతో కలిసి నెట్‌ఫ్లిక్ కోసం ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఒక డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తాను. షూటింగ్ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఎఫ్‌3, రానా నాయుడు రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను.

జీవితం చాలా చిన్నది. ఇంకా ఎవ్వరూ మార‌డం లేదు. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో జనాలు మాకేం వద్దు అన్నారు. ఇప్పుడంతా మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. పక్కవారు ఏం చేస్తారు.. వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఆలోచించడం ఎందుకు?. అందరితో మంచిగా ఉంటే సరిపోతుంది క‌దా!. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి.