మోస్ట్ డిజైర‌బుల్ మెన్ విజ‌య్ దేవ‌ర‌కొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌… ‘పెళ్ళి చూపులు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రై ఆ త‌ర్వాత ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. కేవ‌లం మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు… ప‌క్క రాష్ట్రాల‌లోను విజ‌య్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సినిమాల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు తాజాగా టాప్ హీరోలంద‌రిని వెన‌క్కి నెట్టి అంద‌రు నోళ్ళెల్ల‌బెట్టేలా చేశాడు.

‘హైద‌రాబాద్ టైమ్స్’ నిర్వ‌హించిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ 2018 లిస్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ టాప్ 1 పొజీష‌న్‌లో ఉన్నాడు. టాప్ హీరోస్ ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ , రానా ఎన్టీఆర్ వంటి స్టార్స్ అంద‌రిని వెన‌క్కి నెట్టి మొదటి స్థానం ద‌క్కించుకున్నాడు. 2017లో రెండో స్థానంలో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఏడాది తొలి స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్‌ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, మహేష్ బాబు రెండు, మూడు , నాలుగు స్థానాల‌లో నిలిచారు. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్’ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

‘హీరో’గా యూత్‌ ‘రౌడీ’

యూత్‌తో ‘రౌడీ’గా పిలుపించుకునే విజయ్ దేవరకొండ ‘హీరో’గా కన్పించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ‘హీరో’ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్‌ 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు.  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర, మోహన్‌(సి.వి.ఎం), చెర్రీ నిర్మిస్తున్నారు