అతని సినిమాతోనే టాలీవుడ్‌కు జాన్వీ ?

‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాల ప్రమోషన్‌లో భాగంగా తాను బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశాడు విజయ్ దేవరకొండ . కానీ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ కూడా ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాల్గొని  విజయ్ పై  తనకు ఉన్న అభిమానాన్ని తెలిపింది. అతను మంచి ప్రతిభ గల నటుడని కొనియాడింది. జాన్వీ చెప్పిన మాటలపై  విజయ్  ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు….

జాన్వీ, కరణ్‌ జోహార్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. జాన్వీతో తప్పకుండా నటిస్తానని చెప్పాడు. అంతేకాదు, కరణ్‌ జోహార్‌ను కలిసేందుకు ఓసారి తాను ముంబయిలోని ఆయన ఆఫీసుకు వెళ్లానని, ఆయన ఆఫీసులో కూర్చున్నప్పుడు ‘నేనేంటి ఇక్కడ ఆఫీసులో అని అనిపించింద’ని  విజయ్ అన్నాడు.  విజయ్ మాటలు చూస్తుంటే జాన్వీతో సినిమా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మరణం తర్వాత కరణ్‌ జోహార్‌.. జాన్వీకి గాడ్‌ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘ధడక్‌’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ.. తెలుగు సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె  విజయ్ దేవరకొండ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ‘టాక్సీవాలా’ విజయంతో సంబరాలు చేసుకుంటున్న  విజయ్.. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. భరత్‌ కమ్మా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మీక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది.