తనదైన శైలితో డిజిటల్ రంగంలోకి !

విజయ్ దేవరకొండయాక్టింగ్, ప్రొడక్షన్, బిజినెస్, సోషల్ సర్వీస్.. ఏది చేయాలనుకున్నా వెంటనే చేసేస్తాడు… అది కూడా ‘సక్సెస్‌‌ఫుల్’‌ గా. ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. కరోనా కారణంగా.. థియేటర్లు దూరం కావడంతో స్టార్స్ నుంచి ఫిల్మ్ మేకర్స్ వరకు అందరూ వెబ్ సిరీసులపైనే దృష్టి పెడుతున్నారు. విజయ్‌‌ దేవరకొండ కూడా అదే దారిలో వెళ్తారని తెలుస్తోంది. ‘ఆహా’ అనే ఓటీటీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా ఉన్న విజయ్ ఇప్పుడు వెబ్‌‌ సిరీస్ ల నిర్మాణంలోకి దిగుతున్నాడట. ఇప్పటికే ‘కింగ్ ఆఫ్ హిల్స్’ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. తరుణ్‌ భాస్కర్‌‌‌‌ని హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ తీశాడు. ఇప్పుడు తన బ్యానర్‌‌‌‌పై రెండు వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాడట. వాటిలో ఒక ప్రాజెక్టు ని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ తెరకెక్కించారు.. ఇక రెండో ప్రాజెక్ట్‌‌ను సందీప్ వంగతో కలిసి విజయ్ ప్రొడ్యూస్ చేస్తాడట. ఆనంద్ దేవరకొండ నటిస్తాడట. ‘అర్జున్‌‌రెడ్డి’తో వీళ్లిద్దరూ ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. అందుకే తమ కాంబోకి క్రేజ్ ఉంటుందనే నమ్మకంతో ఇలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
 
‘దేవరకొండ ఫౌండేషన్‌’ సహాయకార్యక్రమాలు!
విజయ్‌ దేవరకొండ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కష్ట కాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి తన చారిటీ ట్రస్ట్‌ ద్వారా సేవలు అందించిన విషయం తెలిసిందే. రూ. కోటితో ‘ది దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్‌)’‌, రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్(ఎంసీఎఫ్‌)‌’ అనే రెండు చారిటీ సంస్థలను ప్రారంభించాడు. తమ ఫౌండేషన్‌ ద్వారా కోటి 70లక్షల ఆర్థిక సహాయంతో 17,000 మంది పేద ప్రజలకు సహాయం చేసినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.
అలాగే నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనే ద్వేయంగా విజయ్‌ ‘దేవరకొండ ఫౌండేషన్‌’ పని చేస్తుందని ఫౌండేషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో తమ ఫౌండేషన్‌ ద్వారా 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే.. కొందరు విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని, మిగతా విద్యార్థుల ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు.