మరోసారి ప్రేక్షకుల ముందుకు సిల్క్‌

సిల్క్‌ స్మిత… శృంగారతారగా  దక్షిణాది చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. సాధారణ నటిగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్‌గా మారిన సిల్క్‌స్మిత జీవితం విషాదంగా ముగిసింది. ఆమె ఎంత ఎత్తుకు ఎదిగారో, చివరి రోజుల్లో అన్ని కష్టాలు చవిచూశారు. ఆమె వ్యక్తిగత, వృత్తిగత జీవితం ఎప్పుడూ హాట్‌టాపిక్‌. అందుకే బాలీవుడ్‌ సిల్క్‌ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. సిల్క్‌ స్మితగా బాలీవుడ్‌ తార విద్యాబాలన్‌ నటించిన ‘డర్టీపిక్చర్‌’ సూపర్‌హిట్‌ అయింది. జాతీయ అవార్డులను అందుకుంది.
ఇప్పుడు మళ్లీ సిల్క్‌ ప్రేక్షకులను మళ్లీ పలకరించనున్నారు. అయితే ఈ సారి వెండితెరపై కాదు…వెబ్‌సిరీస్‌ రూపంలో.తాజాగా ఆమె జీవితాన్ని వెబ్‌సిరీస్‌ రూపంలో రజనీకాంత్ ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో పాపులరైన దర్శకుడు పా.రంజిత్‌ బుల్లితెర ప్రేక్షకులకు అందించబోతున్నారు. సిల్క్‌ స్మిత జీవితంలో తెలియని అంశాలను, కూలంకషంగాఈ వెబ్‌ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘నీలం ప్రొడక్షన్స్‌’ పతాకంపై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌ఉమెన్‌’ అనే డాక్యుమెంటరీని ‘పెరుయేరుమ్‌ పెరుమాళ్‌’ అనే చిత్రాన్నీ నిర్మించారు త్వరలో ఓ హిందీ సినిమా కూడా చేయనున్నారు. రంజిత్‌ అంతకు ముందు ‘ఆట్టకత్తి’, ‘మద్రాస్‌’ చిత్రాలను రూపొందించి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను అందుకున్నారు.